నవతెలంగాణ-హైదరాబాద్: జెఎన్యు లేఖ ‘విద్యార్థి సంఘాన్ని, ఉద్యమాన్ని అణచివేసే మరో ప్రయత్నం”గా జెఎన్యుఎస్యు పేర్కొంది. విద్యార్థులు బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ జెఎన్యు యాజమాన్యం ఢిల్లీ పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న లేఖ రాసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం లేఖను ఖండిస్తూ జెఎన్యుఎస్యు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జెఎన్యు వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఆదేశాల మేరకు యాజమాన్యం లేఖ రాసిందని ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన శాంతియుత ప్రదర్శనను ‘బెయిల్ నిబంధనల ఉల్లంఘన’కు ఉదాహరణగా ఆమె చూపారని తెలిపింది. జెఎన్యుకు మొదటి మహిళా విసిగా నియమితులైన ఆమె.. మహిళా దినోత్సవానికి మద్దతుగా చేపట్టిన ప్రదర్శనను నేరంగా చిత్రీకరించడం ఆందోళన కలిగిస్తోందని ప్రకటించింది.
తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామని జెఎన్యుఎస్యు నేతలు పేర్కొన్నారు. నిరసన తెలిపే హక్కుకు ఆంక్షలు భంగం కలిగించకూడదని బెయిల్ ఉత్తర్వుల్లో చివరి వాక్యం పేర్కొందని జెఎన్యుఎస్యు సంయుక్త కార్యదర్శి, అరెస్టయిన 14మంది విద్యార్థుల్లో ఒకరైన డానిష్ అలీ పేర్కొన్నారు. యూనివర్శిటీ యాజమాన్యం లేఖలో పేర్కొన్న నిరసనలు శాంతియుతంగా జరిగాయని అన్నారు. నిరసనలు చట్టబద్ధమైనవని, బెయిల్ ఉత్తర్వు ద్వారా ప్రాథమిక హక్కును అణచివేయలేరని విద్యార్థుల తరపున హాజరైన న్యాయవాది మాణిక్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 27న విద్యార్థులు చేపట్టిన లాంగ్మార్చ్పై విరుచుకుపడిన ఖాకీలు జెఎన్యుఎస్యు అధ్యక్షురాలు అదితి మిశ్రా సహా 14మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మార్చి 1న బెయిల్పై విడుదలయ్యారు.



