Thursday, June 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమావోయిస్టులకు మరో దెబ్బ

మావోయిస్టులకు మరో దెబ్బ

- Advertisement -

– ఏపీలో ముగ్గురు కీలకనేతల హతం
– మృతుల్లో తెలంగాణవాసి రాజు
– సుక్మా జిల్లాలో మరో ఇద్దరు మృతి
అమరావతి:
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీనియర్‌ మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడశా సరిహద్దు ప్రత్యేక జోన్‌ కమిటీ కార్యదర్శి గజర్ల రవి అలియాస్‌ ఉదరు, ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యురాలు, తూర్పు డివిజన్‌ కార్యదర్శి వెంకట లక్ష్మీ చైతన్య అలియాస్‌ అరుణతో పాటు మరో నాయకుడు అంజు హతమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి, రంపచోడవరం మధ్య ఉన్న కింటుకూర గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఘటనా స్థలంలో ఉన్న 16 మంది మావోయిస్టులకు, దళాలకు మధ్య 25 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఆ ప్రదేశం నుంచి భద్రతా దళాలు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. పారిపోయిన మిగిలిన మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది. ఇదిలావుండగా సుక్మా జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు సమీపంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కూడా కూంబింగ్‌ కొనసాగుతోంది.
శాంతి చర్చల్లో భాగస్వామి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గిజర్ల రాజుకు ఉదరు, గణేష్‌, బిరుసు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈయన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వెలిసెల గ్రామానికి చెందిన వారు. ఈ ప్రాంతంలో పేరున్న మావోయిస్టు నేతలలో ఉదరు ఒకరు. ఈయనపై పాతిక లక్షల రూపాయల రివార్డు ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయనకు మావోయిస్టు ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. 2004-05లో అప్పటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఉదరు కూడా పాల్గొన్నారు. గతంలో ఆయన మల్కాన్‌గిరి, కోరాపుట్‌, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాలకు ఇన్‌చార్జిగా పనిచేశారు. గెరిల్లా యుద్ధ తంత్రంలోనూ, ఐఈడీ వినియోగంలోనూ సిద్ధహస్తుడని పేరు. మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ ఆటవీ ప్రాంతంలో కార్యకలాపాలకు నేతృత్వం వహించారు.
భర్త చనిపోయిన ఐదు నెలలకే…
ఎన్‌కౌంటర్‌లో మరణించిన అరుణ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా జనవరిలో ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అరుణ విశాఖపట్నం జిల్లా కరక్వాని పాలెం గ్రామానికి చెందిన వారు. ఆమెపై ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు మహిళా విభాగంలోనూ, మిలిటరీ సమన్వయంలోనూ ముఖ్యపాత్ర పోషించారు. కాగా రామచంద్రాపురం మండలంలోని కొయ్యలగూడెం, కిట్టుకూరు గ్రామాల మధ్య కూడా ఎన్‌కౌంటర్‌ జరిగిందని సమాచారం అందుతోంది. అయితే వివరాలు ఇంకా తెలియరాలేదు. రవి, అరుణల మృతితో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -