నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వెట్టా వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుడులో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రైలుపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్కు కిలోమీటరు దూరంలో ఉదయం 8:15 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై దుండగులు అమర్చిన బాంబు పేలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికార్పూర్ డిప్యూటీ కమిషనర్ షకీల్ అబ్రో ధృవీకరించారు.
ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిలో నలుగురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి, మిగిలిన ముగ్గురిని షికార్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పేలుడు తర్వాత ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి, రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించినట్లు సుక్కూర్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మోహసిన్ అలీ సియాల్ వివరించారు.