నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ ఇప్పటికే పలు కీలక నేతలను కోల్పోయింది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ హతమయినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ నుంచి హమాస్, హెజ్బొల్లా, హూతీ తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో షాహ్రియారీ ప్రధాన పాత్ర పోషించినట్లు పేర్కొంది.
ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్ కు చెందిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్అలీ హాజీజదే వంటి కీలక నేతలు మృతిచెందారు. అంతే కాకుండా అణు కార్యక్రమంలో పని చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు సైతం ప్రాణాలు కోల్పోయారు.