నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ సమయంలో అసాధారణ పోరాట పటిమను చూపిన బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ నేహ భండారిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరించారు.నేహను సత్కరించిన అంశంపై బీఎస్ఎఫ్ జమ్మూకు చెందిన ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆమెను కీర్తించారు. జమ్మూలోని ఆక్నూర్ సెక్టార్ వద్ద.. పాక్ ఫార్వర్డ్ దళాలను ఆమె బృందం అడ్డుకున్నది. ఈ నేపథ్యంలో కమెండేషన్ డిస్క్తో ఆమెను సన్మానించారు.
అంతర్జాతీయ బోర్డర్ వద్ద ఉన్న పాకిస్థానీ పోస్టుపై చాకచక్యంగా నేహ భండారి బృందం ఎదుర్కొన్నది. జీరో లైన్ వద్ద సుమారు మూడు ఫార్వర్డ్ పోస్టులను ఆ దళం తిప్పికొట్టింది.చాలా విపత్కరమైన పరిస్థితుల్లో నేహ తన టీమ్ను లీడ్ చేసినట్లు తెలిపారు. నేహతో పాటు మరో ఆరు మంది మహిళా కానిస్టేబుళ్లు ఫార్వర్డ్ పోస్టుల వద్ద గన్ పొజిషన్లో ధీటుగా బదులిచ్చారు. సాంబా, ఆర్ఎస్ పురా, ఆక్నూర్ సెక్టార్ల వద్ద శత్రువులను ఎదుర్కొన్నారు.
నేహ భండారి స్వరాష్ట్రం ఉత్తరాఖండ్. నేహ కుటుంబం ఆర్మీలో ఉన్నది. ఆమె మూడవ తరం ఆఫీసర్ కావడం వివేషం. బీఎస్ఎఫ్లో విధులు నిర్వర్తించడాన్ని గర్వంగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆక్నూర్ సెక్టార్లోని పర్గ్వాల్ ఫార్వర్డ్ ఏరియాను ఆమె కమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద దళాలతో నిఘా నిర్వహించడం పట్ల గర్వంగా ఉందని, ఆక్నూరు పోస్టుకు 150 మీటర్ల దూరంలో పాకిస్థానీ పోస్టు ఉన్నట్లు ఆమె తెలిపారు.