Wednesday, June 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు

ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు

- Advertisement -

– అధికారులు సమన్వయంతో పని చేయాలి : హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌
– బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బేగంపేట

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి అధ్యక్షతన సమీక్షా సమావేశం చేపటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర బోనాల ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జులై 13న అమ్మవారికి బోనాలు సమర్పణ, 14న రంగం(భవిష్యవాణి), అంబారిపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఆ రెండ్రోజుల్లో సందర్శకులు లక్షల్లో తరలివస్తారని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా 13న దేవాలయంలో సందర్శకులకు అమ్మవారి దర్శనం కల్పించాలని దేవాలయ, పోలీస్‌ అధికారులకు సూచించారు.
గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ సేవాభావంతోపాటు బాధ్య తాయుతంగా పనిచేయాలని చెప్పారు. 14న అంబారీ ఊరేగింపులో తొక్కిసలాట జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ, శ్రీఉజ్జయిని మహంకాళి, లాల్‌ దర్వాజా బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు నిరంతర విద్యుత్‌, తాగునీరు, వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, తాగు నీటి నిల్వల పరిశీలన, పారిశుధ్య పనులతోపాటు మొబైల్‌ టాయిలెట్స్‌, సీసీ కెమెరాల నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆలయ ఈవోతో పాటు సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే తెలంగాణకు ప్రత్యేకమన్నారు. వివిధ శాఖల అధికారులు పోలీసు అధికారుల సర్వీసును ఈ జాతరలో ఉపయోగించు కోవాలన్నారు. విద్యుత్‌, రోడ్డు భవనాలు, దేవాదాయ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ, పోలీస్‌, అగ్నిమాపక, ఆరోగ్యశాఖలతో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ సుచిత్ర శ్రీకాంత్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.వెంకట్రావు, అడిషనల్‌ సీపీ విక్రంసింగ్‌ మాన్‌, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ, ఆలయ కమిటీ చైర్మెన్‌ ఎస్‌.కామేశ్వర్‌, జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణారావు, టెంపుల్‌ ఈవో మనోహర్‌రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, ఎస్‌సీ విద్యుత్‌శాఖ చక్రపాణి, ఈఈఆర్‌అండ్‌బీ మనోహర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెడికల్‌ తదితర శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -