Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకుల అరెస్టులు

సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకుల అరెస్టులు

- Advertisement -

– అమిత్‌ షా రాకతో గృహనిర్భందాలు
– అరెస్టులను ఖండించండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌
– ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే
నవతెలంగాణ-కంఠేశ్వర్‌

పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా విచ్చేస్తున్న సందర్భంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులను అర్థరాత్రి అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మరికొంతమందిని గృహనిర్బంధం చేశారు. అర్ధరాత్రి నాయకుల ఇండ్లు, పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, అధ్యక్షులు శంకర్‌గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు ఏశాల గంగాధర్‌, నగర కమిటీ సభ్యులు రాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విగేష్‌, వికలాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్‌తో పాటు తదితరులను ఇతర వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు పోలీస్‌ స్టేషన్‌లతోపాటు నవీపేట్‌, మాక్లూర్‌ తదితర పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.
నిర్బంధ అరెస్టులు అప్రజాస్వామికం : బుర్రి ప్రసాద్‌
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులను గృహనిర్బంధం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను అవహేళన చేయడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నిరసనలకు పిలుపివ్వకపోయినా పోలీసులు.. అత్యుత్సాహం చూపి అర్ధరాత్రి నాయకుల ఇండ్ల, పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. జిల్లా ప్రజలకు అనేక వాగ్దానాలిచ్చి బీజేపీ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్‌ వాటిని మర్చిపోయారని ఆరోపించారు. తాను గెలవగానే నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్‌ చేస్తానని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదన్నారు. ఆర్మూర్‌ నుంచి ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌, నిజామాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ డబుల్‌ రైల్వే లైన్‌, బోధన్‌ నుంచి బీదర్‌ వరకు రైల్వేలైన్‌, నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు డబుల్‌ రైల్వే లైన్‌ ప్రతిపాదనలతో పాటు భూసేకరణ జరిగినా.. నేటికీ దానికి సంబంధించిన నిధులను రాబట్టలేకపోయారని విమర్శించారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో లక్కంపల్లి సెజ్‌ కోసం 500 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన ప్రభుత్వం ఉపాధి కల్పన కోసం ఒక్క పరిశ్రమనూ తీసుకురాకపోవడం ఎంపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. జక్రాన్‌పల్లి వద్ద నిర్మాణం కోసం భూములను సేకరించి సంవత్సరాలు గడుస్తున్నా కేంద్రాన్ని ఒప్పించి అంతర్గత రాష్ట్రాల విమానాశ్రయాన్ని నిర్మాణం చేయడానికి నిధులు తీసుకరాకపోవడం చూస్తే ఈ జిల్లా అభివృద్ధికి ఎంపీ అరవింద్‌ పెద్ద ఆటంకంగా ఉన్నారనేది అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీ అరవింద్‌, కేంద్రమంత్రి అమిత్‌ షాకు చిత్తశుద్ధి ఉంటే ఈ పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేష్‌, నాగన్న, జిల్లా నాయకులు నన్నేసాబ్‌, జంగం గంగాధర్‌, కొండ గంగాధర్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -