నవతెలంగాణ – హైదరాబాద్: అర్ధ శతాబ్దానికి పైగా నిరీక్షణకు తెరదించుతూ, మానవాళి మరో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన ఆర్టెమిస్-2 యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న నలుగురు వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు. వారి ఒరైన్ క్యాప్సూల్ ‘ఇంటెగ్రిటీ’ పసిఫిక్ మహా సముద్రంలో విజయవంతంగా స్ప్లాష్డౌన్ అయింది. కమాండర్ రీడ్ వైస్మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్లతో కూడిన ఈ బృందం దాదాపు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి వచ్చింది.
భూ వాతావరణంలోకి ప్రవేశించే ఘట్టం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ధ్వని వేగం కన్నా 33 రెట్లు అధిక వేగంతో (Mach 33) క్యాప్సూల్ భూమి వైపు దూసుకొచ్చింది. అపోలో యాత్రల తర్వాత ఇంతటి వేగంతో వ్యోమనౌక భూమిని చేరడం ఇదే తొలిసారి. వాతావరణంలోకి ప్రవేశించాక, వేలాది డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి క్యాప్సూల్ను రక్షించే హీట్ షీల్డ్ పనితీరుపైనే అందరి దృష్టి నిలిచింది. ఈ సమయంలో దాదాపు ఆరు నిమిషాల పాటు మిషన్ కంట్రోల్కు, వ్యోమగాములకు మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. ఆ తర్వాత పారాచూట్లు తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శాన్ డియాగో తీరంలో సిద్ధంగా ఉన్న యూఎస్ఎస్ జాన్ పి. ముర్తా నౌక సిబ్బంది వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.



