నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా లెజెండరీ స్పిన్నర్, దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) 2025 సీజన్లో తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. నిన్న ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళ్తలైవాస్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా ఔటైన తీరు, ఆ తర్వాత అతను ప్రవర్తించిన విధం చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విన్, మైదానంలోనే మహిళా అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. పూర్తి వివరాలోకి వెలితే.. తిరుప్పూర్ కెప్టెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అశ్విన్ (18 పరుగులు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, అంపైర్ కృతిక వెంకటేశన్ ఇచ్చిన ఈ నిర్ణయాన్ని అశ్విన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిందని, అది ఎల్బీడబ్ల్యూ కాదని అతను వాదించాడు. అంపైర్ వద్దకు వెళ్లి “మేడమ్, అతను ఓవర్ ది స్టంప్స్ నుంచి బౌలింగ్ చేశాడు” అని బంతి వెళ్లిన దిశ ప్రకారం తాను నాటౌట్ అని గట్టిగా వాదించాడు.
టీఎన్పీఎల్ మ్యాచ్లలో డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) అందుబాటులో లేకపోవడంతో అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం అశ్విన్కు లభించలేదు. దీంతో అతని అసహనం మరింత పెరిగింది. తీవ్ర నిరాశతో మైదానం వీడే ముందు, అశ్విన్ తన బ్యాట్ను ప్యాడ్స్కు బలంగా కొట్టుకున్నాడు. ఈ దృశ్యాలు అభిమానులను, వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అంపైరింగ్ ప్రమాణాలు, కీలక సమయాల్లో ఆటగాళ్ల ప్రవర్తనపై విస్తృత చర్చకు దారితీసింది.