సభాపర్వం

Assembly Meet సీఎం నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్‌ స్ట్రోక్‌ : మంత్రి హరీశ్‌ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పోడుభూముల పంపిణీ, వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ తదితర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్‌ స్ట్రోక్‌ వచ్చిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోకపోతున్నాయని ఎద్దేవా చేశారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచడం లేదని చెప్పారు. వాటి గొంతు మూగబోయిందనీ, వారికి ఓ వాయిస్‌ అంటూ లేకుండా పోయిందని విమర్శించారు. బయటే కాదు అసెంబ్లీలో కూడా విపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామని మంత్రి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
మా జిల్లాలో రాజకీయ వరదలు: మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌శ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్త, పాత వరదలు కలుస్తాయని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల్లో అంతర్గత కలహాలు సహజమేనని పేర్కొన్నారు.
తెలంగాణ యాసలో సినిమాలు తీస్తా: మంత్రి మల్లారెడ్డి
కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ అంశం తప్ప మరో అజెండా లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌. మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో తనను కలిసిన విలేకర్లతో మంత్రి మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డిపై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్‌ పెరిగిందని వ్యాఖ్యానించారు. కొంతమంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే మీడియా సంస్థను ప్రారంభిస్తాననీ, తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తానని వెల్లడించారు. ఏదీ జరిగినా అంతా మన మంచికేనని తాను భావిస్తానని చెప్పారు.
చర్చలకు సమయం చాలదు : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
పోడు భూములు, ధరణి పోర్టల్‌, సింగరేణి, బీసీ సబ్‌ ప్లాన్‌ తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు.నీటిపారుదల ప్రాజెక్టులు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చించాలని స్పీకర్‌కు లేఖ రాస్త్తామని తెలిపారు. గురువారం తనను కలిసిన విలేకర్లతో భట్టి మాట్లాడారు. దేశంలో అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రుణమాఫీని వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏ సమస్యను సభలో లేవనెత్తాలో తమ పార్టీకి తెలుసన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వాలు అమ్మిన భూములను గుంజుకుంటామని చెప్పిన కేసీఆర్‌…అధికారంలోకి వచ్చాక ఇప్పుడు విచ్చలవిడిగా భూములు అమ్ముతున్నారని విమర్శించారు.
ఇప్పుడైనా గుర్తుకు రావడం సంతోషకరం రుణమాఫీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి
ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎంకు రైతు రుణ మాఫీ గుర్తుకు వచ్చిందనీ, ఇప్పటికైనా అది గుర్తుకు రావటం సంతోషకరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. కేవలం 36 వేల వరకు ఉన్న రైతుల రుణాన్ని మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. పాత అప్పు కట్టనిదే కొత్త అప్పు బ్యాంకులు ఇవ్వని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. గత నాలుగేండ్లుగా రైతుల రుణ మాఫీ గురించి సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కాలంలో వడ్డీ విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రుణ మాఫీ కాదు. వడ్డీ మాఫీ పథకమంటూ ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకాన్ని జూన్‌ 26 నుండి ప్రారంభించి ఇప్పటివరకు కేవలం 6 ఏకరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఇచ్చారని తెలిపారు.దాన్ని పూర్తి స్థాయిలో అందించాలనీ, రుణమాఫీ కూడా వాయిదా పద్దతిలో కాకుండా సత్వరమే మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. భూగోళం బద్దలయినా ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపబోమంటూ గతంలో సీఎం చెప్పారని గుర్తు చేశారు.ఆర్టీసి కార్మికులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలనీ, లేదంటే వారు నష్టపోతారని తెలిపారు.
బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవకపోవటం అన్యాయం : ఈటల రాజేందర్‌
బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సభ్యుడున్న లోక్‌ సత్తాను కూడా గతంలో బీఏసీకి పిలిచేవారని గుర్తుచేశారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి… తెలంగాణ ప్రభుత్వానికీ, సీఎం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. గతంలో శాసనసభ ఆవరణలో అన్ని పార్టీలకు ఆఫీసుల కోసం గదులు ఉండేవనీ, ప్రస్తుతం తమకు శాసనసభాపక్షం కార్యాలయాలు ఇవ్వలేదని వాపోయారు. ఇది అత్యంత అవమానకర చర్య అని విమర్శించారు. మూడు రోజులు మాత్రమే సభను జరపటం సిగ్గుచేటన్నారు. ఆరునెల్లకోసారి సభ జరగాలి కాబట్టి నిర్వహిస్తున్నారు తప్ప.. ప్రభుత్వానికి ప్రజా సమస్యలు చర్చించాలన్న సోయి లేదని విమర్శించారు.
వరద బాధితుల దు:ఖం వర్ణనాతీతం :ఎమ్మెల్యే సీతక్క
తమ పార్టీ తరుపున వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామనీ, అక్కడి బాధితుల దుఃఖం వర్ణనాతీతమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లల్లోకి వరద పోటెత్తిన వారికి రూ.25 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టం జరిగిన నేపథ్యంలో రైతులకు పరిహారం అందించాలన్నారు. తానే ఇంజనీర్‌ అవతారం ఎత్తి కాళేశ్వరం నిర్మించానంటూ సీఎం చెప్పారనీ, ఆయన ఇంజనీరింగ్‌ వల్లే ప్రస్తుతం మంచిర్యాల పట్టణం మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. వేలాది ఎకరాల పంట పొలాలు మునిగిపోయా యన్నారు. ఆ ప్రాజెక్టు కట్టకముందు సుభిక్షంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని సీతక్క గుర్తు చేశారు. రైతు ఏడుస్తున్నాడు… సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

Spread the love