Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅసైన్డ్‌ మోసం

అసైన్డ్‌ మోసం

- Advertisement -

– భూమికి భూమి ఇస్తున్నామన్న పేరుతో ధోకా
– పట్టా భూమి తీసుకుని అసైన్డ్‌ భూమి కట్టబెట్టిన అధికారులు
– రైతుల పట్టా భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు
– అసైన్డ్‌ పేరిట రైతులకు భూమివ్వడంతో క్రయవిక్రయాలు నిషేధం
– భూమిని అమ్ముకోలేని పరిస్థితిలో సంగయ్య, రాములు కుటుంబాలు
– కూతుళ్ల పెండ్లిండ్లకు భూమి అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన
– రికార్డుల్లో అసైన్డ్‌ అని ఉండటంతో ఎవరూ కొనని వైనం
– మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నాగమణి భర్త
– అసైన్డ్‌కు బదులు పట్టా భూమిగా మార్చాలని డిమాండ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

ప్రభుత్వ ప్రయోజనాల కోసం తమ పట్టా భూమిని ఇచ్చిన రైతుల్ని అధికారులు నమ్మబలికి నట్టేట ముంచారు. మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం కావాల్సిన స్థలం లేని పరిస్థితిలో ఓ ఇద్దరు రైతులు తమకున్న పట్టా భూమిని ఇచ్చేందుకు సిద్దపడ్డారు. నమ్మకాల మీద నడిచే వ్యక్తులు కావడంతో ప్రభుత్వ అధికారులు చెప్పిన మాట విని విలువైన పట్టా భూమిని ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే భూమి కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా అదనపు భూమిని మరో చోట ఇచ్చారు. కానీ.. పట్టా భూమిని తీసుకున్న అధికారులు రైతులకు మాత్రం ప్రభుత్వ భూమిని ఇచ్చారు. అది కూడా భూ బదలాయింపు కింద కాకుండా అసైన్డ్‌ చేసినట్టుగా భూమిని మంజూరు చేసి తీవ్రమైన మోసానికి పాల్పడ్డారు. ఆనాటి రెవెన్యూ అధికారులు చేసిన మోసానికి రెండు నిరుపేద రైతు కుటుంబాలు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాయి. తమ కూతుళ్ల పెండ్లిండ్లు, ఇతర అవసరాల కోసం గుంట భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితికి నెట్టబడ్డారు. తమకిచ్చిన భూమికి అసైన్డ్‌ చేసినట్టు కాకుండా పట్టా చేసినట్టుగా రికార్డుల్లో మార్పులు చేయాలని బాధిత కుటుంబాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.


సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రానికి చెందిన చీలమామిడి సంగయ్య, గవినికాడి రాములు అనే చిన్న కారు రైతులకు సర్వే నెంబర్‌ 419లో 7.18 ఎకరాల భూమి ఉంది. పట్టా రిజిస్ట్రేషన్‌ కలిగిన భూమి కావడమే కాకుండా మండల కేంద్రంలో ఉండటంతో ఇతర భూముల కంటే విలువ ఎక్కువే ఉండేది. ఆ భూమిని 1989-90 సంవత్సరంలో మునిపల్లి మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ఇవ్వాలని అధికారులు రైతుల్ని సంప్రదించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు కట్టేందుకు స్థలం లేనందున రైతులు తమ పట్టా భూమిని ఇస్తే బాగుంటుందని కన్విన్స్‌ చేయడం వల్ల అందుకు రైతులు అంగీకరించారు. అయితే రైతులు ఇచ్చే 7.18 ఎకరాల భూమికి బదులుగా సర్వే నెంబర్‌ 307లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులు సంగయ్య, రాములుకు ఇచ్చే విధంగా ఒప్పించారు. అదనపు భూమి ఇస్తామని చెప్పడంతో అమాయకులైన రైతులిద్దరూ అధికారుల మాటకు విలువ ఇచ్చి తమ పట్టా భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే అధికారులు గమ్మత్తుగా రైతుల్ని మోసం చేశారు. అదనపు భూమి ఇస్తున్నామని చెప్పి భూమి బదలాయింపుల్లో మాత్రం చిక్కులు పెట్టారు. సంగయ్య, రాములుకు ఇస్తామని చెప్పిన 10 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కావడంతో అసైన్డ్‌ చేసినట్టుగా మంజూరు ఇచ్చారు. ఇక్కడే రైతులకు తీవ్ర అన్యాయం జరిగిపోయింది. పట్టా భూమిని కోల్పోయిన రైతులకు పట్టా భూమి ఇవ్వడం లేదంటే భూమిని బదాలాయిస్తున్నట్టు క్రయ విక్రయాలకు అవకాశముండేట్టు రికార్డుల్లో నమోదు చేయాలి. కానీ.. రైతుల్ని అధికారులు పచ్చిగా మోసం చేసి అసైన్డ్‌ భూమిగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. సంగయ్య, రాములిద్దరూ చదువుకోని రైతులు కావడంతో అప్పట్లో తమకిచ్చిన భూమిని చూసుకున్నారు తప్ప భూమి రికార్డుల్ని పరిశీలించుకోలేదు.

అసైన్డ్‌ భూమి కావడంతో క్రయవిక్రయాలు చెల్లవు
చీలమామిడి సంగయ్య, గవునికాడి రాములు పేరిట ఇచ్చిన 10 ఎకరాల భూమి అసైన్డ్‌ చేయబడినది కావడంతో అమ్ముట, కొనుట వీలుకాదు. అట్టి భూముల్ని అమ్మినా కొనుగోలు చేసినా చట్ట రిత్యా చెల్లదు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు దాచిపెట్టారు. సంగయ్య మరణించిన తర్వాత తన భార్య శ్యామలమ్మ పేరిట భూమిని మార్పు చేశారు. అనంతరం శ్యామలమ్మ మరణించిన తర్వాత ఆమె కూమార్తె యాదమ్మ పేరిట మారింది. అదే విధంగా గవునికాడి రాములు మరణించడంతో అతని పేరిట ఉన్న భూమిని అతని భార్య పార్యతమ్మ తన పేరిట మార్చుకున్నారు. పార్వతమ్మ తన భూమిలోంచి ఒక ఎకరం భూమిని తన కూతురు నాగమణికి కట్నం కింద ఇచ్చింది. సంగయ్య కూతురు యాదమ్మ, రాములు కూతురు నాగమణి ఇద్దరు కూడా తమ కూతుళ్ల పెండ్లిండ్లు చేయాల్సి ఉంది. పెరిగిన కూతుళ్ల వివాహాలు జరిపేందుకు ఆర్థిక స్తోమతలేని ఆ ఇద్దరు మహిళలు కూడా తమ వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకునేందుకు సిద్ధపడటంతో కొందరు వ్యక్తులు కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే భూమికి సంబంధించిన రికార్డుల్ని పరిశీలించగా ఆ భూమి అసైన్డ్‌ చేయడం ద్వారా సంక్రమించినట్టుగా ఉంది. దాంతో ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. మనస్తాపానికి గురైన నాగమణి భర్త ఇటీవల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పొరపాట్లను సరిద్దిద్దాలి
పట్టాదారు పాసు పుస్తకం ఉన్న భూమిని తీసుకుని అసైన్‌మెంట్‌ భూమిని కేటాయించి మోసం చేసిన రెవెన్యూ అధికారులే పొరపాట్లను సరిద్దిద్దాలని సీపీఐ(ఎం) సదాశివపేట ఏరియా కమిటీ నాయకులు రమేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఇద్దరు మహిళలు తమకున్న భూమిలో కొంత అమ్ముకుంటే తప్ప తమ కూతుళ్ల వివాహాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్లు జోక్యం చేసుకుని వెంటనే భూముల రికార్డుల్ని మార్పు చేసి బాధిత మహిళలకు న్యాయం చేకూర్చాలని కోరారు.
– రమేష్‌ గౌడ్‌, సీపీఐ(ఎం)

కలెక్టర్‌కు మొరపెట్టుకున్న బాధిత మహిళలు
తమ తండ్రుల నుంచి పట్టా భూమిని తీసుకున్న అధికారులు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమిని మాత్రం అసైన్డ్‌ చేయబడినట్టుగా రికార్డుల్లో పేర్కొనడం వల్ల తీవ్రంగా నష్టపోయిన యాదమ్మ, నాగమణి గత కలెక్టర్‌ క్రాంతి వల్లూరుకు మొరపెట్టుకున్నారు. మునిపల్లి మండల కేంద్ర పర్యటనకు కలెక్టర్‌ వచ్చిన సందర్భంగా ఇద్దరు మహిళలు తమ భూమి సమస్య గురించి కలెక్టర్‌కు విన్నవించారు. తమకిచ్చిన భూమికి అసైన్‌మెంట్‌ పట్టా భూమిని పట్టాదారు భూమిగా మార్పులు చేసి ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన భూ భారతి సదస్సుల్లోనూ యాదమ్మ, నాగమణి ఇద్దరూ కూడా తమ భూమిని పట్టా భూమిగా మార్పు చేయాలని కోరుతూ అర్జీ పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -