నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుత్తల గ్రామంలో ఒక మహిళపై జరిగిన లైంగికదాడి, హత్యాయత్నం ఉద్రిక్తత కలిగించింది. మంకెన జ్యోతి (32) అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ లైంగికదాడికి పాల్పడి, ఆమెను చంపేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన ఇది.
జ్యోతి జీవనోపాధి కోసం మిర్యాలగూడలో నివసిస్తూ, అప్పుడప్పుడూ సొంత గ్రామమైన జూనుత్తలకు వచ్చేది. జూనుత్తలలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న మహేష్తో ఆమెకు గతంలో నుంచే వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఈ సంబంధంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో, మహేష్ ఓ పన్నాగం పూని ఆమెను హత్యచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
గత రాత్రి దేవరకొండ నుంచి కారులో జ్యోతిని తీసుకెళ్తూ మార్గమధ్యంలో వాగ్వాదం జరిగిన సమయంలో మహేష్ తనతో తీసుకొచ్చిన గడ్డి మందును బలవంతంగా తాగించాడు. అపస్మార స్థితిలోకి వెళ్లిన జ్యోతిని కారులో ఎక్కడికో తీసుకెళ్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అనుమానంతో కారును ఆపి తనిఖీ చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే జ్యోతిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసును ఆత్మహత్యగా మలచేందుకు మహేష్ ప్రయత్నించాడని ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, బంధువులు ఆరోపించారు.
వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గుర్రంపోడు ఎస్ఐ పసుపులేటి మధు ఈ విషయాన్ని ధృవీకరించారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.