నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక మరియు గనులు శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఇందిరమ్మ ఇల్లు రాలేదనే కోపంలో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. గురువారం మెదక్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తుండగా.. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ వ్యక్తిని సభ నుంచి బయటికి తరలించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని మందలించి వదిలేసినట్టు సమాచారం. కాగా అర్హులకు తప్పకుండా ఇళ్ళు అందిస్తామని, ఈ విడతలో రాకపోతే తరువాతి విడతలో అయినా తప్పక అందిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.