నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్లోని న్యూజెర్సీ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థి పట్ల పోలీసులు అవమానీయకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బలవంతంగా చేతులను వెనుకకు కట్టేసి..అతని వీపుపై నాలుగురు పోలీసులు మోకాళ్లు పెట్టి బేడిలతో బందించారు. ఈ అవమానీయ సంఘటనపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఇండియన్స్ మీద జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించాలని ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. భారతీయుల గౌరవాన్ని కాపాడటంలో మోదీ తరచూ విఫలమవుతునే ఉన్నారని మండిపడ్డారు.
భారతీయుల మీద ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణ చేశామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అమెరికాలో చెబుతున్నాడు. అమెరికాలో భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయ్.. పదే పదే అవమానాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆయన విమర్శించారు.