నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్తో దౌత్య సంబంధాలను కొనసాగించబోమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం ప్రకటించారు. ఇరాన్ రాయబారిని తమ దేశం నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్లో ఉన్న ఆస్ట్రేలియా దౌత్యవేత్తలను కూడా వెనక్కి రప్పించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో రెండు యూదు వ్యతిరేక దాడులకు ఇరాన్ నేతృత్వం వహించిందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆరోపించారు. సిడ్నీ రెస్టారెంట్, మెల్బోర్న్ యూదుల ప్రార్థనా మందిరంపై జరిగిన దాడులకు ఇరాన్తో సంబంధం కలిగిఉందని నిఘా సంస్థ ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ఎఎస్ఐఓ) ధృవీకరించిందని అన్నారు.
ఎఎస్ఐఓ సమాచారం తమను కలతకు గురిచేసిందని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. దాడుల్లో తమ ప్రమేయం లేదని కప్పిపుచ్చేందుకు ఇరాన్ ప్రభుత్వం యత్నించిందని కానీ దాడుల వెనుక ఇరాన్ ఉన్నట్లు ఎఎస్ఐఓ విశ్వనీయ నిఘా సమాచారాన్ని సేకరించిందని అన్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ను ఉగ్రవాద సంస్థగా జాబితా చేసేందుకు ఆస్ట్రేలియా చట్టం చేయనుందని ఆయన పేర్కొన్నారు.