నవతెలంగాణ-హైదరాబాద్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థికి చెందిన కత్తెర గుర్తుకు ఓటువేసిన బ్యాలెట్ పేపర్లు మురుగు కాలువలో దర్శనమిచ్చాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ సంఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) స్పందించింది. ఎన్నికల సామగ్రి భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విచారణకు ఎస్ఈసీ ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించి స్టేజ్ -2 ఆర్వోపై కలెక్టర్ ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చిన్నకాపర్తి (Chinna Kaparthi) గ్రామంలోని ఓ డ్రైనేజీ కాల్వలో పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు లభ్యమయ్యాయి. అవన్నీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి చెందిన ‘కత్తెర గుర్తు’కు ఓటువేసి ఉన్నవే కావడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్స్ దొరికిన స్థలానికి చేరుకున్న జగదీశ్ రెడ్డి ఎన్నికల్లో అవకతవకలపై ఎన్నికల అధికారులకు, పోలీస్లకు ఫిర్యాదు చేశారు.



