నవతెలంగాణ-హైదరాబాద్: గత మూడు సార్వత్రిక ఎన్నికల అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు కమిటీని నియమించినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా 2014, 2018, 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, ప్రభుత్వ ప్రమేయం ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు, భవిష్యత్తులో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన సిఫార్సులు చేయడానికి కమిటీని నియమించినట్లు గురువారం విడుదలైన క్యాబినెట్ డివిజన్ నోటిఫికేషన్ను ఉటంకిస్తూ అధికారిక మీడియా పేర్కొంది.
హైకోర్టు మాజీ జస్టిస్ షమిమ్ హస్నిన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ సెప్టెంబర్ 30 నాటికి నివేదికను సమర్పించనుందని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. సంబంధిత ఎన్నికల కమిషన్లు పాల్పడిన ఆర్థిక అవకతవకలను కూడా దర్యాప్తు చేయనుంది. ఏ కార్యాలయానికి చెందిన అధికారులకైనా నోటీసులు జారీ చేయవచ్చని, అవసరమైతే దర్యాప్తు కోసం అదనపు సభ్యులను భాగస్వామ్యం చేయవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది.
అప్పటి పాలక అవామీ లీగ్ పార్టీ అధికారం దక్కించుకునేందుకు పౌరుల ఓటు హక్కులను క్రమపద్ధతిలో హరించడంతో పాటు మూడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో చట్టపాలన, ప్రజాస్వామ్యం, ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని, దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతమైన విమర్శలు ఎదుర్కొన్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది.