- కాటారం డిఎస్పీ సూర్యనారాయణ
నవ తెలంగాణ-మల్హర్రావు: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పి విద్యార్థులతో మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడడం వల్ల వచ్చే అనర్ధాలు,కలిగే నష్టాలు గురించి చెబుతూ విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు.అనంతరం అందరి చేత సైబర్ నేరాలపై అవగాహన ప్రతిజ్ఞ చేయించారు.కళాశాలలో నిర్వహించి విద్యార్థులకు,అధ్యాపకులకు అవగాహన కల్పించినందుకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయ దేవి డిఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి,కొయ్యూరు ఎస్సై నరేష్,పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు,సిబ్బంది,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.



