- ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి
నవతెలంగాణ-వనపర్తి: భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీలో సోమవారం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎం.శ్రీనివాస్, డాక్టర్ సతీష్ రెడ్డి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి హాజరయ్యారు. కార్యక్రమానికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా..భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణ జ్యోతి మాట్లాడుతూ భగత్ సింగ్ జీవిత చరిత్రను వివరించారు. చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నత విప్లవకారుడిగా ఆయనను కొనియాడారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు, అన్యాయాలపై పోరాడే ధైర్యాన్ని పెంచేందుకు భగత్ సింగ్ జీవితం మార్గదర్శకమని పేర్కొన్నారు.
యువత సమాజంలో ఉన్న సమస్యలపై స్పందించి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన త్యాగాలు వృథా కాకుండా సమానత్వం, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
మెడికల్ క్యాంపులో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సేవలు అందించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ శుభ్రత, పోషకాహారం, నియమిత పరీక్షల అవసరాన్ని వైద్యులు వివరించారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజ్ లెక్చరర్ లత, విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జితేందర్ గౌడ్, ఐద్వా జిల్లా కోశాధికారి కవిత, సహాయ కార్యదర్శి ఉమా, సహాయ కార్యదర్శి శాంతమ్మ, కాలనీ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ జమీర్, మండ్ల రాజు, వినోద్, మాజీ కౌన్సిలర్ జములమ్మ, లక్ష్మీదేవమ్మ, కమలాదేవి, స్వప్న సుమిత్ర, ఆశ వర్కర్స్ ఏఎన్ఎంలు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు శ్రీకాంత్, జానకి రాముడు, ధనుంజయ్త దితరులు పాల్గొన్నారు.






