నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ బీజేపీ నేతలందరికీ రెండు ఓటరు కార్డులు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీకి చెందిన మహిళా మేయర్కు రెండు ఓటరు కార్డులున్నట్లు బయటపడింది. దీంతో ఆ నాయకురాలికి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటీస్ జారీ చేసింది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను ఈసీ చేపట్టింది. అయితే కొత్త ఓటర్లు భారీగా చేరడం, లక్షల్లో ఓటర్లను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ముజఫర్పూర్ మేయర్, బీజేపీ నాయకురాలు నిర్మలా దేవికి రెండు ఓటరు కార్డులున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగస్ట్ 16 లోపు వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీస్ జారీ చేసింది.
కాగా, బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటరు కార్డులు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. పాట్నా జిల్లాలోని లఖిసరై అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిన్హాకు రెండు వేర్వేరు ఎపిక్ నంబర్లు ఉండటంపై ఆధారాలతో నిరూపించారు. రెండు ఓటరు కార్డులున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ సిన్హాకు కూడా ఈసీ నోటీసు జారీ చేసింది. రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటంపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.