నవతెలంగాణ-హైదరాబాద్: మద్యం నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మళ్లీ ప్రాణాలు తీసింది. తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహారి పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించారు. తుర్కౌలియా, రఘునాథ్పూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ జోర్వాల్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితులపై హత్య కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో మృతులు కల్తీ మద్యం సేవించినట్లు తేలిందని తెలిపారు.
మద్యం సరఫరాదారుడిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసులు, యాంటీ-లిక్కర్ టాస్క్ ఫోర్స్ (ఎఎల్టీఎఫ్) సంయుక్తంగా పర్సౌని, ముషహరి టోలా, తుర్కౌలియా ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తుర్కౌలియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ మద్యపాన నిషేధ విధానం ఒక బూటకమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.



