నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ స్పెషల్ రివిజన్ కేసుపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. బిహార్ ఓటర్ల సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతోందని పేర్కొంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బిహార్లో ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం చేపట్టడం భావ్యమేనని పేర్కొంది. ఈ ఆర్టికల్ ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణకు ఈసీఐకి విశేష అధికారులు కల్పిస్తోంది అభిప్రాయపడింది. 2003లో చివరిసారి అలాంటి ఇలాంటి ప్రక్రియనే భారత ఎన్నిక సంఘం చేపట్టిందని సుప్రీం కోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం భారత ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టిన ఈసీపై ప్రతిపక్షాల ఇటీవలే సుప్రీం కోర్టులో పిటషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు కఠినమైన డాక్యుమెంటేషన్, నిబంధనలు, తక్కువ సమయం కారణంగా వెనుకబడిన వర్గాల ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు ధర్మాసానానికి విన్నవించారు. అదేవిధంగా అర్షద్ అజ్మల్, రూపేష్ కుమార్, యోగేంద్ర యాదవ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్లలో, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 325, 326 నిబంధనలను ఉల్లంఘిస్తుందని కోర్టుకు తెలిపారు. తాజాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..తీర్పు వెల్లడించింది.