నవతెలంగాణ-హైదరాబాద్: తన కుమారుడు చైతన్య అరెస్టును భూపేష్ బఘేల్ ధ్రువీకరించారు. తన కుమారునికి ‘పుట్టినరోజు బహుమతి’ ఇచ్చినందుకు అధికార బీజేపీలో అత్యున్నత నేతలైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలకు ధన్యవాదాలు అని ఎక్స్లో పోస్ట్ చేశారు. మోడీ, షాలు ఇచ్చిన బహుమతిని ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ ఇవ్వలేరని, ఈ బహుమతిని జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ని ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.దుర్గ్ జిల్లాలోని భిలారులో బఘేల్ నివాసాన్ని సోదా చేసిన కొద్దిసేపటికే ఈడి అరెస్ట్ జరిగింది. మార్చిలో కూడా బఘేల్ నివాసంలో సోదాలు చేపట్టింది. అయితే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి సోదాలు చేపట్టినట్లు ఈడి తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,160 కోట్లకు పైగా నష్టం కలిగించిన ఆర్థిక నేరంలో వచ్చిన ఆదాయాన్ని చైతన్య తీసుకున్నారని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. 2019-2022 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగినట్లు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి జనవరిలో రాష్ట్ర మాజీ వర్తక, వాణిజ్య పన్ను శాఖ మంత్రి కవాసి లఖ్మాను ఈడీ అరెస్ట్ చేసింది.