నవతెలంగాణ-హైదరాబాద్ : అధికార బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఒక కేసులో తనను ప్రభావితం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి నేరుగా సంప్రదింపులు జరిపాడని రాతపూర్వకంగా పేర్కొంటూ, ఆ కేసును విచారించనని ఒక జడ్జి బహిరంగంగా ప్రకటించడం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించింది. గనుల కంపెనీ యజమాని, బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ కేసు విషయమై తనతో చర్చించడానికి ప్రయత్నించాడని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశాల్ మిశ్రా ఈ నెల 1న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొని, ఆ పిటిషన్ను విచారించడానికి తిరస్కరించారు. జడ్జి నిర్ణయం కోర్టు రూములో బాంబులా పేలి న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. అధికార బీజేపీ ఎమ్మెల్యే తనను నేరుగా కలిసి, కేసు విషయమై ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడని సిట్టింగ్ జడ్జి ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ కేసును చూస్తే మైనింగ్ మాఫియా ఎంత శక్తివంతమైనదో అర్ధమవుతున్నది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే పాఠక్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన మైనింగ్ కంపెనీలు పలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు కూడా ఏమీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కాట్నీకి చెందిన అశుతోష్ మను దీక్షిత్ ఈ ఏడాది జూన్లో హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే చిత్రంగా ఎమ్మెల్యే మైనింగ్ సంస్థల్లో అక్రమాలు నిజమేనని ఖనిజ శాఖ ప్రకటించింది. అతనికి చెందిన మూడు కంపెనీలకు 443 కోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో న్యాయమూర్తిని కలిసి ప్రలోభ పెట్టడానికి ఎమ్మెల్యే పాఠక్ ప్రయత్నించారు.