నవతెలంగాణ-హైదరాబాద్: రాజుల పాలనలా ఇండియాను మార్చాలని బీజేపీ అనుకుంటోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం, గతంలో తీసుకువచ్చిన ‘మూడు నల్ల వ్యవసాయ చట్టాల’ ఉద్దేశం ఒకటేనని విమర్శించారు. జవహర్ భవన్లో గురువారం జరిగిన నేషనల్ ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్మికుల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొత్త చట్టంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకే పనులు, నిధులను కేంద్రం కేటాయిస్తుందని చెప్పారు.
కేంద్రం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని వెనక్కి తీసుకుని ఎంజీఎన్ఆర్ఈజీఏను పునరుద్ధరించేంత వరకూ తాము పోరాడతామని చెప్పారు. దీనిపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ సదస్సులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు ‘వీబీ జీ రామ్ జీ’కు వ్యతిరేకంగా పేద ప్రజలంతా ఏకం కావాలని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కోరారు.



