నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల జిమ్మిక్కులు మొదలు పెట్టింది. ఈక్రమంలోనే వందే భారత్ తొలి స్లీపర్ రైలు రాకపోకలు కోల్కతా- గువాహటిల మధ్య సాగనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు.
పశ్చిమబెంగాల్- అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్ ధరలు.. విమాన టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. వందేభారత్ స్లీపర్లో 3 ఏసీలో టికెట్ ధర (ఆహారంతో కలిపి) సుమారు రూ.2,300, 2ఏసీ ధర సుమారు రూ.3 వేలు, 1ఏసీ ధర సుమారు రూ.3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్యతరగతిని దృష్టిలోపెట్టుకొని టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ రైల్లో 16 పెట్టెలు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన (ఏసీ) స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి.



