నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్పై శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టా నుంచి పెషావర్కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.