నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. తంపనూరు పోలీస్ స్టేషన్కు గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్ పంపారు. క్లిఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ ఇ-మెయిల్లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేసి.. అది నకిలీ ఇ-మెయిల్గా తేల్చారు.
‘‘బాంబు బెదిరింపు తర్వాత ముఖ్యమంత్రి నివాసాన్ని డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాం. కానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనబడలేదు’’ అని పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో సీఎం విజయన్, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపుల వ్యవహారంతో తాజాగా వచ్చిన ఇ-మెయిల్కు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.