నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం ప్రసాద్ నగర్లోని ఆంధ్రా స్కూల్ సహా ఆరు పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిని ఆయా పాఠశాలల్లో గాలింపు చేపట్టాయి. ద్వారక సెక్టార్లోని బీజీఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, మ్యాక్స్ఫోర్ట్, ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ స్కూల్, ఛావ్లాలోని రావ్ మాన్ సింగ్ సీనియర్ సెకండరీ స్కూల్ స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు రావడం వారం రోజుల్లో ఇది మూడోసారి.
బుధవారం 50కిపైగా స్కూళ్లకు దుండగులు మెయిల్ బెదిరింపు చేశారు. టెర్రరైజర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్లకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. డీఏవీ పబ్లిక్ స్కూల్, ఫెయిత్ అకాడమీ, డూన్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయతో పాటు ఇతర స్కూళ్ల బెదిరింపులు వచ్చాయి. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు.
క్రిప్టోకరెన్సీ రూపంలో 5వేల డాలర్లు ఇవ్వాలంటూ అదే గ్రూపు ఆగస్టు 18వ తేదీన బాంబు బెదిరింపులకు పాల్పడింది. ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటర్స్కు బెదిరింపు గ్యాంగ్ బల్క్ మెయిల్ పంపింది. ఐటీ సిస్టమ్స్ను ఉల్లంఘించినట్లు తెలిపారు. స్కూల్ ఆవరణల్లో 48 గంటల్లోగా బాంబులు పేల్చుతామని మెయిల్లో పేర్కొన్నారు. మేం టెర్రరైజర్స్ 111 గ్రూపుకు చెందినవాళ్లమని, మీ బిల్డింగ్లో పేలుడు పదార్ధాలు అమర్చామని, క్లాస్రూమ్లూ.. ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్లు, స్కూల్ బస్సులను శక్తివంతమైన సీ4 బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు.