నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధానిలో వరుస బాంబు బెదిరింపులు విద్యాసంస్థలను వణికిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం ఢిల్లీలోని తొమ్మిది ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస ఘటనల్లో ఇది తాజా పరిణామం. ఉదయం సుమారు 8:30 నుండి 9:00 గంటల మధ్య వివిధ జిల్లాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు రావడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక దళం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను యుద్ధ ప్రాతిపదికన ఆయా పాఠశాలలకు తరలించారు.
ముందస్తు జాగ్రత్తగా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని వెంటనే బయటకు పంపించి స్కూళ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ సభ్యులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బెదిరింపులు కేవలం పుకార్లేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్తో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు విద్యాసంస్థల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


