నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. సోమవారం ఉదయం నగరంలోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ద్వారకా ప్రాంతంలోని రెండు పాఠశాలలు, ఓ కళాశాలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఆయా విద్యాసంస్థలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సోమవారం ఉదయం 7:24 గంటల సమయంలో బాంబు బెదిరింపులకు సంబంధించిన సమాచారం తమకు అందినట్లు ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. సమాచారం రాగానే ఢిల్లీ పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆయా విద్యాసంస్థల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాలలు, కళాశాల ప్రాంగణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.