Wednesday, June 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల‌ మ‌ధ్య బాంబుల మోత

ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల‌ మ‌ధ్య బాంబుల మోత

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓవైపు చ‌ర్చ‌లంటునే..మ‌రో వైపు ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల‌ మ‌ధ్య బాంబుల మోత మోగుతుంది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ భారీ డ్రోన్‌ దాడులకు దిగింది. ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ చేపట్టిన ఈ దాడుల్లో 40కిపైగా రష్యా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఇస్తాంబుల్‌లో సోమవారం శాంతి చర్చలు జరగనుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్‌ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి అని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌ దాడిలో ధ్వంసమైన ఎయిర్‌క్రాఫ్టుల్లో టీ యూ-95, టీయూ-22 వ్యూహాత్మక బాంబర్లు కూడా ఉన్నాయని పేర్కొంది.

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా కూడా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సోమవారం ఇస్తాంబుల్‌లో జరిగే శాంతి చర్చలకు తమ ప్రతినిధులను పంపుతున్నామని జెలెన్‌స్కీ ప్రకటించిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం.

అయితే ఇరుదేశాల అధికారులు కూడా దాడుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు.రష్యాలోని ఇర్కుట్స్‌ ప్రాంతంలోని స్రెడ్నీ సెటిల్‌మెంట్‌లోని సైనిక విభాగంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసిందని రష్యా ప్రాంతీయ గవర్నర్‌ ఇగోర్‌ కొబ్జెవ్‌ నిర్ధారించారు. ఒలెన్యా, బెలాయా సహా ఐదు మిలిటరీ బేస్‌లపై దాడి జరిగినట్టు చెప్పారు. ఉక్రెయిన్‌పై అత్యధిక సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ వైమానిక దళం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌పై 472 డ్రోన్లతో రష్యా దాడిచేసిందని, వీటితో పాటు ఏడు క్షిపణులను కూడా ప్రయోగించిందని ఉక్రెయిన్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ యూరీ ఇగ్నాట్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -