నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల బ్రెజిల్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలను ఉద్దేశిస్తూ.. ఆ కూటమి సభ్యదేశాలపై అదనపు సుంకాలను విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు చేశారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలకు బ్రెజిల్ అద్యక్షుడు దీటుగానే బదులిచ్చారు. ప్రపంచానికి చక్రవర్తి అవసరంలేదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాలపై అమెరికా పెత్తనం సరికాదని, ఏకపక్ష నిర్ణయాలతో టారఫ్ విధింపు సరైన చర్య కాదని యూఎస్ ప్రెసిడెంట్ కు కౌంటర్ ఇచ్చారు. దీంతో బిత్తరపోయిన ట్రంప్..బ్రెజిల్ దేశంపై ప్రతీకార చర్యలు చేపట్టారు. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో హింస్తున్నారని అనే నెపంతో బ్రెజిల్ ఎగుమతులపై సుంకాలు విధించారు. తాజాగా మరోసారి జైర్ బోల్సొనారో పేరుతో ఆదేశ న్యాయమూర్తికి యూఎస్ పర్యటన వీసాను ట్రంప్ రద్దు చేశారు. తన మిత్రుడైన బోల్సొనారో పట్ల బ్రెజిల్ న్యాయవ్యవస్థ అన్యాయంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కాలి చీలమండకు ఎలక్ట్రానిక్ పర్యవేక్షక పరికరాన్ని అమర్చి ఆయన కదలికల్ని గమనించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
2022 ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని బోల్సొనారో.. ఆ ఎన్నికలు రద్దు చేసి తిరుగుబాటు చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సుప్రీం ఫెడరల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్లకూడదని, విదేశీ రాయబారులతో మాట్లాడరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సోషల్ మీడియా వినియోగించరాదని, తన కుమారుడు ఎడ్వర్డో బోల్సొనారోతో పాటు విచారణ ఎదుర్కొంటున్న ఇతర నిందితులతోనూ మాట్లాడకూడదని ఆజ్ఞాపించింది. ఆయన నివాసం, పార్టీ కార్యాలయాల్లో సోదాలకు అనుమతించిన న్యాయస్థానం.. యాంకిల్ మానిటర్ను ధరించాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు తన కాలికి ఎలక్ట్రానిక్ పర్యవేక్షక యంత్రాన్ని అమర్చుకున్న మాజీ అధ్యక్షుడు.. ఇది తనకు జరిగిన తీవ్ర అవమానమని వ్యాఖ్యానించారు.