నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ పాఠశాలలో ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాల బాత్రూంలో దాక్కున్న ఓ దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు పాఠశాల ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాడు. నేరుగా టాయిలెట్లోకి వెళ్లి అక్కడ దాక్కున్నాడు. కాసేపటికి బాత్రూంకి వచ్చిన బాలికపై లైంగికదాడికి పాల్పడి, వచ్చిన దారిలోనే గోడ దూకి పారిపోయాడు. భయంతో వణికిపోయిన ఆ చిన్నారి, జరిగిన దారుణాన్ని టీచర్లకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతో పాటు లైంగికదాడి కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పాఠశాల గోడ సమీపంలో నివసించే ఓ వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.