కేటీఆర్‌పై కేసు నమోదు

– సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలపై..
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం రేవంత్‌ రెడ్డి బిల్డర్లు, వ్యాపారుల నుంచి రూ.2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు ఇచ్చారంటూ, లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌ బీజేపీలోకి వెళ్తారని ఇటీవల కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత బత్తిన శ్రీనివాసరావు హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌ నిరాధారమైన ఆరోపణల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగి పార్టీల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్నొన్నారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హనుమకొండ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.

Spread the love