నవతెలంగాణ-హైదరాబాద్: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం సహా ఇతరులపై ఢిల్లీకోర్టు శుక్రవారం అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. నేరపూరిత వ్యాపారాన్ని కొనసాగించడానికి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిత్వ శాఖను తన వ్యక్తిగత ఆస్తిగా వినియోగించుకున్నారని, రైల్వే అధికారులు, అతని సన్నిహితుల సహకారంతో ఆయన కుటుంబం భూములను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలను బేరసారాల సాధనంగా వినియోగించారని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. ఈ కేసులో కోర్టు 41 మందిపై అభియోగాలు మోపింది. రైల్వే అధికారులు సహా 52మందిని విడుదల చేసింది.
విచారణ సమయంలో ముందుగా, ఈ కేసులో నిందితుల స్థితికి సంబంధించి సీబీఐ ధృవీకరణ నివేదికను సమర్పించింది. చార్జ్షీట్లో పేర్కొన్న 103మంది నిందితుల్లో ఐదుగురు మరణించారని నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వారి కుమారుడు తేజస్వీయాదవ్ ఇతరులపై సీబీఐ చార్జ్షీట్లు దాఖలు చేసింది.
ఈ కేసు రాజకీయంగా ప్రేరేపితమని ఆర్జేడీ విమర్శించింది. ఈ అభియోగాలను తీవ్రంగా ఖండించింది.



