నవతెలంగాణ-హైదరాబాద్: సీఎంఆర్ఎల్ కేసులో ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి కుమార్తె టి. వీణ తీవ్రంగా ఖండించారు. సీబీఐ పిల్ తనకు ‘అపకీర్తి కలిగించే’ ప్రయత్నంగా పేర్కొన్నారు. ఎక్సలాజిక్, కొచ్చికి చెందిన ప్రైవేట్ ఖనిజ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సిఎంఆర్ఎల్) మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ప్రతిస్పందనగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఆమె పైవిధంగా పేర్కొన్నారు. ఆ కంపెనీని తాను స్థాపించి, నిర్వహించానని, తనతండ్రితో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని హైలెట్ చేశారు. కంపెనీ వ్యాపారంలో ఆర్థికంగా లేదా ఇతరత్రా ఆయనకు ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2014లో ఆమె కంపెనీని స్థాపించగా, 2016 మేలో పినరయి విజయన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
కోవలం ప్యాలెస్ ఆరోపణలను తోసిపుచ్చింది. కోవలం ప్యాలెస్కు సంబంధించిన ఏ నిర్ణయం, కమ్యూనికేషన్ లేదా లావాదేవీలో తనకు ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ఒక మహిళపై దురుద్దేశంతో కూడినవని, పరువునష్టం కలిగించేవి మరియు అవమానకరమైనవి అని ఆమె పేర్కొన్నారు. ఇది ప్రజావ్యాజ్యం ముసుగులో బురద జల్లడం తప్ప మరొకటి కాదని పునరుద్ఘాటించారు.