– ఈ విధానాన్ని నిలిపివేయలేదని
– ప్రకటించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖల్లోని పోస్టుల ఎంపిక కోసం నిర్వహించే లాటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఈ విధానాన్ని రద్దు చేయలేదని, ఈ విధానం ఇప్పటికీ తెరిచే ఉందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు. బుధవారం ఎన్డీఏ 11 ఏండ్ల ప్రభుత్వ పాలనపై జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. లాటరల్ ఎంట్రీ విధానం స్టేటస్ గురించి విలేకరుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ‘అట్టడుగు వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వ సేవల్లో సరైన ప్రాతినిద్యం పొందటానికి రాజ్యంగంలో ఈ విధానాన్ని పొందుపర్చారు. మేం దీన్ని నిలిపివేయలేదు. దీన్ని చాలా గొప్ప ఉద్దేశ్యంతో ప్రారంభించారు. ప్రధానమంత్రిగా మోడీ లాంటి వ్యక్తి ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని నేను భావిస్తున్నాను’ అని మంత్రి తెలిపారు. లాటరల్ ఎంట్రీని రద్దు చేసినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించిన దాదాపు 10 నెలల తరువాత కేంద్ర మంత్రి ఈ విధంగా ప్రకటించడం విశేషం. లాటరల్ ఎంట్రీ రద్దు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ యూటర్న్ తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి తరువాత లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వంటి మిత్రపక్షాల నుంచి కూడా బీజేపీ వ్యతిరేకతను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
‘లాటరల్ ఎంపిక’పై కేంద్రం యూటర్న్
- Advertisement -
- Advertisement -