Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంజస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం!

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం!

- Advertisement -

– వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీసుకొచ్చే అవకాశం
– ఇలా అభిశంసన ద్వారా వేటుకు గురయ్యే మొదటి జడ్జి ఆయనే
– ఇది ప్రజల విజయం..రాజకీయాలు చేయొద్దు
– స్వాగతించిన అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌
న్యూఢిల్లీ:
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసనను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా కేంద్రం ఈ తీర్మానాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తున్నది. ఆయనను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్టుగా సమాచారం. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం జస్టిస్‌ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నదని తెలుస్తున్నది. ఈ కేసులో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే ఆయనపై ఈ చర్యకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 14న రాత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కాలిన స్థితిలో కనిపించటం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మార్చి 22న ఈ ఘటనపై ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన కమిటీ… నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని తెలపటంలో జస్టిస్‌ వర్మ విఫలమయ్యారని తేల్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిటీ జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ నివేదికను సమర్పించింది. ఆయనను అభిశంసించవచ్చని పేర్కొన్నది. ఆ నివేదిక ప్రకారమే.. ఈనెల 9న సంజీవ్‌ ఖన్నా.. జస్టిస్‌ యశ్వంత్‌వర్మను అభిశంసించి.. పదవి నుంచి తొలగించాలన్న సిఫారసును భారత రాష్ట్రపతి, ప్రధానులకు సిఫారసు చేశారు. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ ప్రతిపాదనను పెడతారు. ఈ తీర్మానం ముందుకు సాగాలంటే…50 మంది రాజ్యసభ సభ్యులు, 100 మంది లోక్‌సభ సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆమోదం పొందాలంటే.. ఉభయ సభలలో మూడింటా రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి. ఇందుకు అనేక పార్టీల సపోర్ట్‌ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ పార్లమెంటులో ఈ అభిశంసన తీర్మానం వచ్చి.. ఆమోదం పొందితే.. జస్టిస్‌ వర్మ తన పదవికి దూరమవుతారు. అదే జరిగితే.. ఇలా అభిశంసన ద్వారా వేటుకు గురయిన మొదటి న్యాయమూర్తి ఆయనే కావచ్చని తెలుస్తున్నది. కాలిన నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో జస్టిస్‌ వర్మ.. ఆ తర్వాత అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయిన విషయం విదితమే. ఆయన బదిలీని ఆ సమయంలో అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే.. జస్టిస్‌ వర్మకు ఎలాంటి జ్యుడిషియల్‌ డ్యూటీలూ కేటాయించలేదు.
న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది : అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌
జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సమర్థించింది. కేంద్రం ఈ తీర్మానాన్ని తీసుకురావచ్చన్న వార్తలను స్వాగతించింది. దీనిని ప్రజల విజయంగా అభివర్ణించింది. ఈ చర్య న్యాయవ్యస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని వివరించింది. ఈ పరిణామంపై అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అనిల్‌ తివారీ మాట్లాడారు. ”ఈ చర్య (అభిశంసన) అనేది న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెరిగేలా చేస్తుంది. న్యాయమూర్తులే అవినీతిపరులైతే, కోర్టుపై ప్రజలకు నమ్మకం పోతుంది. అవినీతిపరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం తప్పనిసరి. ఇది జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు సంబంధించింది మాత్రమే కాదు.. కోర్టు ఉనికి, ప్రజల నమ్మకం, ప్రజాస్వామ్యానికి సంబంధించింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే, ప్రజాస్వామ్యం ముగుస్తుంది” అని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దనీ, అభిశంసనకు మద్దతుగా ఓటు వేయాలని ప్రతిపక్ష పార్టీలను తాము కోరినట్టు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -