Thursday, June 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపహల్గాం దాడిని నివారించడంలో కేంద్రం వైఫల్యం

పహల్గాం దాడిని నివారించడంలో కేంద్రం వైఫల్యం

- Advertisement -

ట్రంప్‌ జోక్యం సరికాదు
కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలు వెల్లడించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-హుజూర్‌ నగర్‌

పహల్గాంపై ఉగ్రదాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ముందే తెలిసినప్పటికీ నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఆ దాడిలో 26మంది మరణించడం బాధాకరమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును సమావేశపరిచి పహల్గాం యాత్రికులపై దాడి అనంతరం పాకిస్థాన్‌ యుద్ధ పరిస్థితుల గురించి వివరాలను దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన పోరాటంలో నష్టపోయిన యుద్ధ విమానాల గురించి తెలియజేయాలన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కాల్పుల విరమణకు ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చేసిన ప్రకటనపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టంగా స్పందించలేదన్నారు. ఇండియా, పాకిస్థాన్‌ సమస్యలో ట్రంప్‌ జోక్యం ఎందుకో కేంద్ర ప్రభుత్వం తెలియజేయలేదని, దాన్ని నేటికీ ఖండించలేదని అన్నారు. భారత్‌ ద్వైపాక్షిక విషయంలో ట్రంప్‌ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం దేశంలో మత ఘర్షనలను పెంచి ముస్లిములను రెచ్చగొడుతోందన్నారు. దేశంలో మీడియా కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో ఉందని, ముఖ్యమైన ఛానల్స్‌ వాస్తవాన్ని కాకుండా గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. శత్రుత్వం ఇండియా పాకిస్థాన్‌ దేశాల మధ్యనే తప్ప ప్రజల మధ్య కాదన్నారు. నదీ జలాలను ఆపినట్లైతే ఆ దేశంలోని రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందన్నారు. రైతుబంధు, వ్యవసాయ కూలీలకు పెన్షన్లు, మహిళలకు పెన్షన్లు వంటి హామీలు ఏవీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కేసీఆర్‌, కేటీఆర్‌లపై విమర్శలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పటికీ అవి లబ్దిదారులకు కాకుండా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా.. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ అరెస్టు అయ్యేది సీపీఐ(ఎం) నాయకులే అని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, పోలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగవరపు పాండు, ములకలపల్లి రాములు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్‌ రెడ్డి, దుగ్గి బ్రహ్మం, భూక్య పాండు నాయక్‌, షేక్‌ యాకూబ్‌, సైదులు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, రేపాకుల మురళి, మాలోత్‌ బాలు నాయక్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -