- Advertisement -
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
నవతెలంగాణ -ముధోల్: ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహం పునప్రతిష్టించాలని దళిత సంఘాలు శుక్రవారం చలో బోరిగాంకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించటంతో బోరిగాంకు ఎవరిని రాకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. దీంతో చలో బోరిగాం ముధోల్ కు పరిమితం అయింది. ముందుగా దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముధోల్ బౌద్ధ విహార్ లో సమావేశం ఏర్పాటు చేశారు. దళితులపై జరిగిన దాడిని ఖండించారు. అనంతరం చలో బోరిగాంకు ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారిగేట్లు దాటుకోవడానికి ఆందోళనకాలను ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.-
ఆందోళనకారులను పోలిసులు సముదాయించారు. అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అడ్మిన్ ఎస్పి ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు . దీంతో ఒకరు కూడా బోరిగాం కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. అయితే ఆందోళనకారులు వెంటనే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు . మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పలుమార్లు పోలీసులు బైంసా తాసిల్దార్ ,ఆర్డీవో చర్చలు జరిపినప్పటికీ ఫలితం రాలేదు. బోరిగాంలో బుద్ధ విగ్రహాన్ని పున ప్రతిష్టించాలని , వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల బోరిగాం గ్రామం నుండి ముధోల్ కు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. అంతేకాకుండా ఫోన్లో జిల్లా కలెక్టర్ తో ఎస్పీ ఆందోళనకారులతో మాట్లాడించారు. నిర్దిష్టమైన హామీ కావాలని ఆందోళనకారులు పట్టు పట్టారు. దీంతో ఎస్పీ సంయమనం తో వ్యవహరించి , ఆందోళనకారులను మాత్రం బోరిగాం వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్య సున్నితమైనది కావడంతో ఎస్పీ ఉదయం నుండి బోరిగాం, ముధోల్ లోని ఉండి బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు.- ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. బుద్ధ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వ స్థలం ఇప్పించి కాంస్య విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీని ఇచ్చారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. దీంతో రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు పోలీసులు క్లియర్ చేశారు. చలో బోరిగాంకు ఎవరిని వెళ్లకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల , అడిషనల్ ఎస్పీ లు కట్టుదిట్ట భద్రతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆందోళన కారులు బోరిగాంకు వెళ్లకుండా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఆందోళన కూడా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
-
- Advertisement -