Friday, June 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమగ్ర నిఘాతోనే డ్రగ్స్‌కు చెక్‌

సమగ్ర నిఘాతోనే డ్రగ్స్‌కు చెక్‌

- Advertisement -

– నిరంతర సమన్వయం, సహకారంతో నడవాలి
– మాదక పదార్థాల నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాల నార్కోటిక్‌ అధికారుల భేటీలో నిర్ణయం : సమావేశాన్ని ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ జితేందర్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
సమాజానికి పెను సవాళ్లను విసురుతున్న మాదక పదార్థాల రవాణా, వినియోగంపై చెక్‌ పెట్టటానికి దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం అవసరమని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ గురువారం అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీజీఏఎన్‌బీ) నేతృత్వంలో మాదక పదార్థాల నియంత్రణకు డ్రగ్స్‌ అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌), ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), నార్కోటిక్‌ బ్యూరో, కస్టమ్స్‌ అధికారుల సమన్వయ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. టీజీఏఎన్‌బీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా, కేరళ, పాండిచ్చేరిలకు చెందిన యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో జితేందర్‌ మాట్లాడుతూ.. మాదక పదార్థాల నిరోధంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సమాజంలోని యువత నిర్వీర్యమయ్యే ప్రమాదమున్నదని హెచ్చరించారు. ఇది కేవలం ఒకటి, రెండు రాష్ట్రాలకు చెందిన సమస్య కాదనీ, ఈ పెను భూతం భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక పదార్థాల రవాణాలో డ్రగ్‌ స్మగ్లర్లు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నారని అన్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డిజిటల్‌ స్వరూపాలను కూడా ఉపయోగించుకుంటున్నారని ఆయన వివరించారు. దీనితో ప్రతిరోజూ పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. మాదక పదార్థాల నియంత్రణకు దక్షిణాది రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సమన్వయమై ఎప్పటికప్పుడు మాదక పదార్థాల రవాణాదారుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సినవసరం ఉన్నదని ఆయన సూచించారు. అలాగే, ఎక్కువగా మాదక పదార్థాల రవాణా జరిగే ప్రాంతాలపై నిఘాను పెంచాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. రాష్ట్రాల సరిహద్దులలో సైతం చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని జితేందర్‌ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మాదక పదార్థాల రవాణా, వినియోగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకొని వాటికి వ్యతిరేకంగా వ్యూహాలను, ఎత్తుగడలను మార్చుకోవాల్సి ఉన్నదని చెప్పారు.
టీజీఏఎన్‌బీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య మాట్లాడుతూ.. మాదక పదార్థాలకు బానిసలైనవారిని కనిపెట్టి వారిని డిఅడిక్షన్‌ కేంద్రాలకు తరలించాలని సూచించారు. మాదక పదార్థాలను నిరోధించటం ఎంత ముఖ్యమో.. వాటికి బానిసలైనవారిలో మార్పును తీసుకురావటం కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. కాగా, నిరంతరం సరిహద్దులలో మాదక పదార్థాల రవాణాపై నిఘా పెంచటం, డ్రగ్‌ సరఫరాదారులకు ఎక్కడి నుంచి అవి వస్తున్నాయో కనిపెట్టటం, డ్రగ్‌ రవాణాదారులకు ఆర్థిక సాయం అందిస్తున్న శక్తులు ఎవరనేది కనిపెట్టటం, ఎక్కువగా మాదక పదార్థాల విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించటం, మాదక పదార్థాలు తరచుగా రవాణా అయ్యే దారులపై నిఘా వేసి ఉంచటం, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు తరచుగా సమన్వయమై మాదక పదార్థాల నిరోధంలో సాధిస్తున్న ఫలితాలను సమీక్షించుకోవటం మొదలైన అంశాలపై నిశితంగా దృష్టిని సారించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ భేటీలో నార్కోటిక్‌ బ్యూరో సదరన్‌ అదనపు డీజీ టి.జి వెంకటేశన్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల యాంటీ నార్కొటిక్‌ బ్యూరోకు చెందిన ఐజీలు, డీఐజీలు, కస్టమ్స్‌ డీఆర్‌ఐ, ఈడీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -