నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ స్వీయ ప్రచారం, స్వయం కీర్తి కోసం నిరంతరం యత్నిస్తారని, పాలనలో కొనసాగింపును ఆయన ఎప్పుడూ అంగీకరించరని కాంగ్రెస్ ఎంపి జైరాం రమేష్ విమర్శించారు. చీనాబ్ వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. చీనాబ్ వంతెన, బ్రహ్మోస్ మిసైల్, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులు పాలనలో కొనసాగింపుకు ప్రధాన ఉదాహరణలని అన్నారు.
పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో1995 మార్చిలో ఈ చీనాబ్ ప్రాజెక్టుకు అనుమతి లభించిందని, 2002 మార్చిలో అటల్ బిహారీ వాజ్పేయి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, వంతెనకు సంబంధించిన అనిన కాంట్రాక్టులను 2005లోనే ఇచ్చారని అన్నారు. ఈ ప్రాజెక్టులో పలువురు ప్రధాన మంత్రుల భాగస్వామ్యం ఉందని అన్నారు. ఈ రోజు జమ్ముకాశ్మీర్, భారతీయ రైల్వేకు ముఖ్యమైన రోజు అయినప్పటికీ, గత ప్రధానుల కృషిని కూడా గుర్తించాలని అన్నారు. గత 30 ఏళ్ల సమిష్టి విజయం అని, ఈప్రాజెక్టును విజయవంతం చేయడానికి వరుసగా పలువురు ప్రధానులు తమ వంతు కృషి చేశారని అన్నారు. కానీ ప్రధాని మోడీ స్వీయ ప్రచారానికే ప్రాధాన్యతనిచ్చారని జైరాం రమేష్ మండిపడ్డారు.