నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో సూపర్ సక్సెస్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) త్వరలోనే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్) లోనూ అడుగుపెట్టబోతోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. నేడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. మహిళల క్రికెట్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం తమ తదుపరి ప్రాధాన్యత అని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
తాము త్వరలోనే మహిళల క్రికెట్లో పెట్టుబడి పెట్టబోతున్నామని, డబ్ల్యూపీఎల్లో చెన్నై జట్టును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. బీసీసీఐ జట్లను విస్తరించాలని నిర్ణయించినప్పుడు సీఎస్కే యాజమాన్యం బిడ్డింగ్లో పాల్గొని జట్టు సభ్యులను కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్లో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే బ్రాండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లోకి వస్తుండటంతో అభిమానులు అంతులేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వంటి జట్లు డబ్ల్యూపీఎల్లో రాణిస్తుండగా.. తాజాగా చెన్నై కూడా తోడైతే లీగ్ స్థాయి మరింత పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.



