నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. సీఎం కార్యాలయంతో పాటు బెంగళూరులోని కోరమంగళలో గల రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సీఎం నివాసం, పాస్పోర్ట్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి బాంబర్లు దాడి చేస్తారని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం 3:15 గంటల ప్రాంతంలో దాడికి ప్రణాళిక వేసినట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్పై అప్రమత్తమైన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపు
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో బెదిరించారు. ఈ బెదిరింపు కాల్తో అప్రమత్తమైన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానని బెదిరించి ఫోన్ పెట్టేశాడు. దీంతో అప్రమత్తమైన ఘజియాబాద్ పోలీసులు ఈ విషయాన్ని వెంటనే ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే, ఆ ఫోన్ నంబర్ స్విచ్ఆఫ్ అని వస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.