నవతెలంగాణ-హైదరాబాద్: భారత సైన్యం భవిష్యత్ కార్యాచరణ, ఆధునికీకరణ దిశగా కీలక అడుగు పడింది. సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, పలువురు మాజీ ఆర్మీ చీఫ్లతో కలిసి ఢిల్లీ వేదికగా రెండు రోజుల ‘చీఫ్స్ చింతన్’ సదస్సును ప్రారంభించారు. ఇటీవల విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశం, సైనిక వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అంతర్గత సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించింది. మాజీ ఉన్నతాధికారుల అపార అనుభవాన్ని ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి, భవిష్యత్ ప్రణాళికలను పటిష్టం చేసుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తోంది.

సమావేశం తొలి రోజున ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సమగ్రంగా చర్చించారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం సమన్వయంతో చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్, కీలక ఉగ్రవాద నెట్వర్క్లను ఛేదించడంలో సఫలమైంది. “ఈ ఆపరేషన్ నిర్వహణ, వ్యూహాత్మక ప్రభావం, సంయుక్త కార్యాచరణ నమూనాను మాజీ చీఫ్లకు వివరంగా తెలియజేశారు. వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు. కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి చేపడుతున్న ఆధునిక సాంకేతికతల సమీకరణ, ఆధునికీకరణ కార్యక్రమాల గురించి కూడా వారికి వివరించారు” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సదస్సులో పాల్గొన్న మాజీ ఆర్మీ చీఫ్లు జనరల్ వి.పి. మాలిక్, జనరల్ ఎన్.సి. విజ్, జనరల్ జె.జె. సింగ్, జనరల్ దీపక్ కపూర్, జనరల్ బిక్రమ్ సింగ్, జనరల్ మనోజ్ పాండేలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వాగతం పలికారు. భారత సైన్యంలో కొనసాగుతున్న పరివర్తన, భవిష్యత్ దిశానిర్దేశంలో వారి నిరంతర భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన నొక్కిచెప్పారు.