Saturday, June 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కుదిపేస్తున్న 'చైనా మట్టి'

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కుదిపేస్తున్న ‘చైనా మట్టి’

- Advertisement -

– అమెరికా పారిశ్రామికాభివృద్ధిపై పెను ప్రభావం
– అంతర్జాతీయంగా ట్రంప్‌పై పెరుగుతున్న ఒత్తిళ్లు
సంఘమిత్ర

‘చైనా మట్టి’…ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. చైనాపై అక్కసుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల దాడిని ఈ ‘మట్టి’ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన ప్రపంచం…అమెరికా అధ్యక్షుడికి మొట్టికాయలు వేయడంతో దిగిరాక తప్పలేదు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక, ఏప్రిల్‌ 2న వివిధ దేశాలపై ‘దిగుమతి సుంకాలు’ భారీగా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ కుప్పకూలి, ఒక్క రోజులోనే మదుపర్లకు చెందిన 20 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము మట్టిలో కలిసిపోయింది. మిగతా దేశాలన్నింటికంటే చైనాసరుకులపై కక్షగట్టి 145 శాతం సుంకాలను ట్రంప్‌ సర్కార్‌ విధించిన విషయం తెలిసిందే. చైనాను లొంగదీయాలంటే ఏ దేశమూ తమ హైటెక్‌ ఉత్ప త్తులు, టెక్నాలజీలను ఇవ్వొద్దంటూ ఆంక్షలు విధించారు. కొన్నేండ్లుగా అమెరికా ఈ తరహా వ్యవహారాలు చేస్తూనే ఉంది. వాటన్నింటినీ భరిస్తూ వచ్చిన చైనా చివరకు ఆర్థిక ప్రతిదాడిని తీవ్రం చేసింది. దానిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చైనా మట్టితో తయారైన ”రేర్‌ ఎర్త్‌ మాగ్నైట్స్‌” ఎగుమతులపై ఆంక్షలు విధించింది. సునిశిత తనిఖీల తర్వాత వీటి ఎగుమతులకు పరిమితంగా లైసెన్సులు ఇచ్చింది. చైనా రేర్‌ ఎర్త్‌ (మట్టి) ఖనిజాల్లో ఇదీ ఒకటి. దీనిద్వారా 17 రకాల ఖనిజాలు ఉత్పత్తి అవుతాయి. ఈ తరహా మట్టి నిల్వలు ప్రపంచ నిల్వలతో పోలిస్తే 70 శాతం ఇక్కడే ఉన్నాయి. ఈ మట్టిలోని ఖనిజాలను వెలికితీసే శుద్ధి టెక్నాలజీని చైనా బాగా అభివృద్ది చేసింది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్‌ వాహనాలు, రిఫ్రిజిరేటర్లు, లాప్‌టాప్స్‌, మిలటరీ యుద్దవిమానాలు మొదలు ప్రతి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తికి అవసరం. వీటి సరఫరా లేకపోతే ఆయా వస్తువుల ఉత్పత్తే నిలిచిపోతుంది. అందువల్లే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను స్తంభింపచేసేంత శక్తి ఈ ఖనిజాలతో తయారైన ‘మాగెట్స్‌’ కు ఉంది. చైనాతో తమ దేశానికి ముప్పు ఉందంటూ అమెరికా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ, సుంకాల దాడికి పాల్పడింది. ఇప్పుడు చైనా కూడా తమ రేర్‌ ఎర్త్‌ ఖనిజాలను ‘వినియోగ వస్తువుల తయారీకి మాత్రమే అనుమతిస్తామనీ, మిలటరీ ఉత్పత్తులకు ఉపయోగిస్తే తమ దేశ భద్రతకు ముప్పు ఉందంటూ ఆంక్షలు విధించింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎలక్ట్రానిక్‌, ఆయుధ ఉత్పత్తులపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఇండియాలో మారుతి సుజుకి తన విద్యుత్‌ కార్ల ఉత్పత్తి ప్లాన్‌లో మూడోవంతుకు పరిమితమవుతున్నట్టు ప్రకటించింది. బజాజ్‌ స్కూటర్ల అధిపతి రోహన్‌ బజాజ్‌ కూడా రెండు నెలల్లో ఈ ప్రతిష్టంబన వీడకపోతే తమ ఉత్పత్తినే నిలిపేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని ఫోర్డ్‌ కంపెనీ ఇప్పటికే ఒక ప్లాంట్‌ను మూసేసింది. ముఖ్యంగా అమెరికా ఆయుధ పరిశ్రమ పూర్తి సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన యుద్ధాల్లో అమెరికా ఇతర సామ్రాజ్యవాద దేశాలు ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌ వంటి దేశాలకు భారీగా ఆయుధాలు సప్లయి చేసి, తమ నిల్వల్ని ఖాళీ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధాలు తిరిగి ఉత్పత్తి కావాలంటే చైనా నుండి ‘రేర్‌ఎర్త్‌’పై ఆంక్షలు తొలగితే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు అమెరికాను కట్టడి చేసే స్థాయికి చైనా చేరుకుంది.

సోషలిస్ట్‌ పాలన వల్లే సాధ్యమైన విజయం
రేర్‌ఎర్త్‌ ఖనిజాలపై చైనాకు గుత్తాధిపత్యం సోషలిస్టు వ్యవస్థ వల్లే సాధ్యమైంది. 1990లోనే డెంగ్‌జియావో పెంగ్‌ ఈ ప్రాధాన్యతను గుర్తించి, భారీగా పెట్టుబడులు కేటాయించి, ప్రాసెసింగ్‌పై పరిశోధన చేసారు. 1950 నుంచి 2018 వరకు రేర్‌ఎర్త్‌పై అమెరికా 10వేల పేటెంట్లు కలిగి ఉంటే, అదే కాలంలో చైనా 50 వేల పేటెంట్లు పొందింది. ఈ పరిశ్రమను మిలటరీ, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తదితర హైటెక్‌ పరిశ్రమలతో సింక్రనైజ్‌ చేయడంతో ఉత్పత్తి పెరిగి ధర చౌక అయ్యింది. 1990లో 27శాతం ఉత్పత్తి చైనాలో జరిగితే, అమెరికాలో 38 శాతం జరిగింది. 1995లో చైనా 60 శాతం, అమెరికా 28 శాతానికి చేరాయి. 2000 సంవత్సరం నాటికి చైనా 87 శాతం, యూఎస్‌ 6 శాతానికి పరిమితమైంది. చైనా రేర్‌ఎర్త్‌ పరిశ్రమ పూర్తిగా ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండటం వల్లే ఇది సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -