నవతెలంగాణ-హైదరాబాద్: ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రతిభకి తలుపులు మూసేస్తుంటే.. చైనా మాత్రం స్వాగతిస్తోంది. సాంకేతిక, ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్నవారికి చైనా తన దేశ ద్వారాలు తెరిచింది. నేటి ప్రపంచీకరణ ప్రపంచంలో సరిహద్దుల మధ్య ప్రతిభ మార్పిడి ఎంతో కీలకమని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గువో జియాకున్ నొక్కి చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల ఆవిష్కరణలకు, కెరీర్ అవకాశాలను పెంపొందించడంలో చైనా తన నిబద్ధతను చాటుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సోమవారం జరిగిన మీడియా సమావేశంలో గువో జియాకున్ మాట్లాడుతూ.. ‘ప్రపంచీకరణ ప్రపంచంలో సరిహద్దుల మధ్య ప్రతిభ ప్రవాహం ప్రపంచ సాంకేతిక, ఆర్థిక పురోగతికి కీలకం. మానవాళి పురోగతి.. కెరీర్ విజయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రతిభా వంతులు వచ్చి తమ వృత్తి నైపుణ్యాలను కొనసాగించడానికి చైనా స్వాగతిస్తుంది’ అని గువో జియాకున్ అన్నారు. ఇప్పటికే యువతను ఆకర్షించడానికి చైనా కె. వీసాను ప్రవేశపెట్టింది.
కాగా, ఇటీవల ట్రంప్ హెచ్ -1బి వీసా దరఖాస్తు వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచడంతో యువత ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. విదేశీయులు అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలంటేనే బెంబెలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది.