నవతెలంగాణ – హైదరాబాద్: ఏఐ ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ఊపేస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ, అబద్ధాలను కూడా నిజమని నమ్మించేలా సృష్టిస్తోంది. తాజాగా టాలీవుడ్ సెన్సేషన్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, జక్కన్న రాజమౌళి కొట్టుకుంటున్నారు!
ఏఐ సృష్టించిన ఈ వీడియోలో.. మహేశ్ బాబు, రాజమౌళి ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని, తోసుకుంటూ గొడవ పడుతున్నారు. ఇది చూసిన సామాన్యులు ఒక్క క్షణం నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అని భ్రమపడేలా ఆ వీడియో ఉంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘సినిమా ఈజ్ డెడ్’’ అంటూ వర్మ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. అంటే, భవిష్యత్తులో షూటింగ్స్ అవసరం లేకుండానే ఏఐతో సినిమాలు తీసేయొచ్చని ఆయన పరోక్షంగా సెటైర్ వేశారు.
ఈ వీడియో కింద నెటిజన్ల కామెంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ‘‘మహేశ్ పాస్పోర్ట్ ఎక్కడ పెట్టావో చెప్పు అని రాజమౌళిని అడుగుతున్నట్టు ఉన్నాడు’’ అని ఒకరు, ‘‘సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పకపోతే కొడతా అంటున్న మహేశ్’’ అని మరొకరు జోకులు పేల్చుతున్నారు.



