Sunday, June 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'మహేంద్ర అండ్‌ మహేంద్ర'లో నాలుగోసారి సీఐటీయూ విజయం

‘మహేంద్ర అండ్‌ మహేంద్ర’లో నాలుగోసారి సీఐటీయూ విజయం

- Advertisement -

– ఈ విజయం కార్మికులదే.. మెరుగైన సేవలు అందిస్తా : అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-జహీరాబాద్‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మహేంద్ర ఎడీి ప్లాంట్‌లో గురువారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు వరుసగా నాలుగవసారి విజయం సాధించారు. పరిశ్రమలో మొత్తం 543 ఓట్లు ఉండగా 539 ఓట్లు పోలయ్యాయి. అందులో ఐఎన్టీయూసీ అభ్యర్థి జనక్‌ ప్రసాద్‌కు 369 ఓట్లు రాగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, పరిశ్రమ యూనియన్‌ అధ్యక్షులు చుక్కరాములుకు 370 ఓట్లు వచ్చాయి. దాంతో ఒక ఓటుతో చుక్క రాములు నాలుగవసారి విజయం సాధించి మహేంద్ర అండ్‌ మహేంద్ర పరిశ్రమ గ్రూపులోనే చరిత్ర సృష్టించారు. విజయం సాధించిన వెంటనే గేట్‌ ముందుకు వచ్చిన చుక్కరాములును కార్మికులు నినాదాలు చేస్తూ తమ భుజస్కందాలపై మోసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చుతూ ఏడీ ప్లాంట్‌ నుంచి టెక్నీషియన్‌ కాలనీ, మహేంద్ర ఎంప్లాయీస్‌ కాలనీ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికులు తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కార్మికులదేనన్నారు. ఎన్నికల గేట్‌ మీటింగ్‌ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి కార్మికులందర్నీ ఐక్యపరిచి వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే పరిశ్రలో గత యూనియన్లు తాకట్టు పెట్టిన కార్మికుల హక్కులన్నింటినీ విడిపించి ప్రతి కార్మికునికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టామని, దాని వల్లనే తనను కార్మికులు గెలిపించారన్నారు. ప్రధానంగా కార్మికుల పిల్లల్లో పదవ తరగతి పాసైన వారికి ట్రైనింగ్‌ ఇచ్చి పరిశ్రమలో ఉద్యోగం కల్పించడం, డీఏ పెంచడం, అర్హులైన కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయించడం, కార్మికుల బేసిక్‌ శాలరీ పెంచేందుకు చేసిన కృషి ఫలితమే ఈ విజయమని చెప్పారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ.. మహేంద్ర అండ్‌ మహేంద్ర కార్మికులు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. కార్మికులకు మెరుగైన సేవలతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు అన్ని విధాలా చర్యలు చేపడతామన్నారు. ఈ విజయం మహేంద్ర అండ్‌ మహేంద్ర పరిశ్రమలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యుల విజయమంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు మహిపాల్‌, కనకారెడ్డి, రాజిరెడ్డి, మాణిక్‌, వీరయ్య గౌడ్‌, ఉమామహేశ్వరరావు, నరేష్‌, మహేష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -